CommunityLatest NewsPoliticsState

రాజకీయ రగడ- ముస్లిం మహిళల మారుతున్న జీవితాలు

ముస్లిం మహిళలు నాలుగు గోడలకే పరిమితం కావాలా?

కాంతపురం ఎ.పి. అబూబకర్ ముస్లియార్ చేసిన మహిళా వ్యతిరేక ప్రకటనపై నడుస్తున్న వాదనలు, విభేదాలు కేరళలోని ముస్లిం మహిళల జీవితాలు, వారి స్వేచ్ఛపై కొత్త చర్చకు తెరలేపాయి.

ఇండియన్ గ్రాండ్ ముఫ్తీ అయిన అబూబకర్ ముస్లియార్ కోజికోడ్, కొచ్చిలలో తన వ్యాఖ్యలను మళ్ళీ పునరావృతం చేశారు. మహిళలు అణకువగా ఉండాలని, ఇళ్లకే పరిమితం కావాలని ఖురాన్ చెబుతోందని, మహిళలు బహిరంగ వేదికలపై కనిపించకూడదని ఆయన అన్నారు. మహిళలపై ఉన్న గౌరవంతోనే వారిని బహిరంగ వేదికలపైకి రావద్దని కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఇస్లాం మహిళలకు అన్ని రకాల గౌరవాన్ని ఇస్తుందని, అయితే కొందరు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

కొచ్చిలో జరిగిన ‘హుబ్బు రసూల్’ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. కుటుంబ నియంత్రణను ప్రవేశపెట్టిన అనేక దేశాలు ఇప్పుడు దాని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటున్నాయని, సమాజంలోని కొన్ని వర్గాలపై వారి నమ్మకాలకు విరుద్ధంగా ఆచారాలను రుద్దడం సరికాదని వాదించారు.

ఈ వ్యాఖ్యల అనంతరం ‘సమస్త కేరళ జమియ్యతుల్ ఉలమా’ సంస్థ తమ అనుబంధ సంస్థలు, సమాజాలకు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. పరాయి పురుషుల మధ్య బహిరంగ ప్రదేశాలలో లేదా వేదికలపై మహిళలను ప్రదర్శించవద్దని అందులో ఆదేశించింది. యువతులను బహిరంగ రోడ్లపైకి లేదా పరాయి పురుషుల మధ్య ఉండే వేదికలపైకి తీసుకురాకూడదని ఆ సర్క్యులర్ పిలుపునిచ్చింది.

ఇటీవల జరిగిన ఓణం, నబీదినం వేడుకల్లో మహిళలు, చిన్నపిల్లలు పాల్గొనడంపై సంస్థ లోపల, వెలుపల తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో అబూ బకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

సమస్త అధ్యక్షుడు ఇ సులైమాన్ ముస్లియార్, జనరల్ సెక్రటరీ కాంతపురం ఎ.పి. అబూబకర్ ముస్లియార్ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, ఇస్లామిక్ పరిమితులను ఉల్లంఘించి నిర్వహించే మతపరమైన వేడుకలు, ఉత్సవాలను తీవ్రంగా పరిగణించాలని అన్నారు. ఇస్లామిక్ వేడుకలు నిర్ణీత పరిమితుల్లోనే ఉండాలని వారు నొక్కి చెప్పారు.

“మహల్లు నాయకత్వం అప్రమత్తంగా ఉండాలి” అనే శీర్షికతో జారీ చేసిన ఈ సర్క్యులర్.. మహల్లు నిర్వాహకులు, మసీదులు, మదరసాలు, ఇతర సంస్థలు, అనుబంధ సంస్థలు తమ కార్యక్రమాలను ఇస్లామిక్ ప్రమాణాల ప్రకారం నిర్వహించేలా చూడాలని ఆదేశించింది. ముఖ్యంగా పరాయి పురుషుల మధ్య బహిరంగ ప్రదేశాలలో, వేదికలపై మహిళలను ప్రదర్శించడం అనుచితమని, మతపరంగా నిషిద్ధమని స్పష్టం చేసింది.

మతపరమైన వేడుకల్లో ఇస్లామేతర ఆచారాలు, వేడుకల పద్ధతులను నివారించాలని, భావి తరాలకు ఆదర్శంగా నిలవాలని మహల్లు నిర్వాహకులను,  ఇస్లాం ను పాటించేవారిని కోరింది.

పండుగ సీజన్లో కళాశాలలు, పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో నిర్వహించిన ఓణం వేడుకలు, ఓణం ఆటల పోటీలలో ముస్లిం బాలికలు పాల్గొనడమే దీనికి కారణం. హిందూ, క్రైస్తవ బాలికలతో కలిసి ముస్లిం అమ్మాయిలు కూడా కేరళ సాంప్రదాయ దుస్తులను ధరించి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

దీనిపై స్పందన చాలా వేగంగా వచ్చింది. ప్రముఖ రాజకీయ పార్టీలు కాంతపురం ప్రకటనను తిరస్కరించాయి. అయితే ముస్లిం లీగ్, అలాగే వామపక్ష నాయకుడు కె.టి. జలీల్‌తో సహా మరికొందరు ఆయన వైఖరిని సమర్థించారు. కాంతపురం వ్యాఖ్యలను ఒక మత పండితుడి అభిప్రాయంగా భావించవచ్చని ముస్లిం లీగ్ పేర్కొంది.

సిపిఎం నాయకులు పినరయి విజయన్, ఎం.వి. గోవిందన్, ఎల్‌డిఎఫ్ కన్వీనర్ టి.పి. రామకృష్ణన్, సిపిఐ నాయకుడు బినోయ్ విశ్వంతో సహా ఇతర ప్రముఖ వామపక్ష నాయకులు ఈ ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకించారు.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, వి. మురళీధరన్, కె. సురేంద్రన్, పి.కె. కృష్ణదాస్, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు నవ్య హరిదాస్ కూడా కాంతపురం వైఖరిని విమర్శించారు. ఇది మహిళా వ్యతిరేకమని, ఇలాంటి ఆంక్షలు మహిళలను అణచివేత వైపు నెట్టివేస్తాయని హెచ్చరించారు.

మాజీ ముస్లిం లీడర్ పి.కె. జమీతా టీచర్, ముస్లిం మహిళల పురోగతి కోసం పనిచేస్తున్న ‘నిసా’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు వి.పి. సుహ్రా మాట్లాడుతూ.. ఈ వివాదం ముస్లిం మహిళల జీవన పరిస్థితులు, స్వేచ్ఛపై ఉన్న ప్రశ్నలను బహిర్గతం చేసిందని అన్నారు.

అయితే, అత్యంత బలమైన నిరసన స్వరం స్వయంగా ముస్లిం అమ్మాయిల నుంచే వచ్చింది.

కాసరగోడ్ నుండి పరశ్శాల వరకు కళాశాలలు, పాఠశాలల విద్యార్థినులు ఓణం వేడుకల్లో, ఇతర మతాల పండుగలలో పాల్గొనడాన్ని వ్యతిరేకించిన మత సంస్థలు, మతపెద్దల ఆదేశాలను తిరస్కరించారు. తలపాగా ఉన్నవారూ లేనివారూ.. వందలాది మంది అమ్మాయిలు సాంప్రదాయ కేరళ కసవు దుస్తులు ధరించి ఓణం పాటలు, ఆటలు మరియు విందులలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

చాలామంది పరిశీలకులకు ఇది కేవలం ఒక పండుగలో పాల్గొనడం మాత్రమే కాదు; బహిరంగ సమాజంలో ముస్లిం అమ్మాయిల తరం తమ ఉనికిని చాటుకోవడాన్ని ఇది ప్రతిబింబించింది.

ఈ మొత్తం వ్యవహారం  ఒక పెద్ద ప్రశ్నను ముందుకు తెచ్చింది: ముస్లిం మహిళలు తమ స్వంత జీవితాలను నిర్ణయించుకోవడానికి ఎంత స్వేచ్ఛ ఉండాలి?

UDF పై పెరిగిన మతపరమైన  ఒత్తిడి

 

జి.కె. సురేష్ బాబు

(కేరళకు చెందిన సీనియర్ పాత్రికేయుడు జి.కె. సురేష్ బాబు. మూడు భాగాల వ్యాసాల పరంపరలో కాంతపురం ఎ.పి. అబూబకర్ ముస్లియార్ చేసిన వ్యాఖ్యలను, ముస్లిం మహిళలు, సభలలో వారి భాగస్వామ్యం, జాస్మిన్ విప్లవం సమయంలో ఏం జరిగింది అనే అంశాలపై ఆయన  విశ్లేషించారు. ఆసక్తికరమైన సమాచారం.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *



Select State

Telangana

Andhra Pradesh

Assam

Delhi

Manipur

Nagaland

Uttarakhand